ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి కరోనా.. ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాల మూసివేత!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌ రావడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏకంగా 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. ఏపీ వ్యక్తికి కరోనా వస్తే ఎక్కడో ఉన్న యూపీలోని గ్రామాలను మూసివేయడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌‌లోని బడౌన్‌ జిల్లాలో భవానీపూర్‌ కాలీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.తర్వాత అతడు గ్రామానికి చేరుకున్నాడు. దీంతో గత కొంత కాలంగా సదరు వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం అతడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు నివాసం ఉంటున్న 3 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను మూసివేస్తున్నట్లు బడాన్‌ జిల్లా కలెక్టర్‌ కుమార్‌ ప్రశాంత్ ప్రకటించారు.
‘‘ఆ వ్యక్తికి కరోనా సోకిందని తెలియడంతో అతడు నివసిస్తున్న గ్రామానికి 3 కిలో మీటర్ల పరిధిలో ఉన్న 14 గ్రామాలను మూసివేశాం. దీంతో ప్రస్తుతం ఆ 14 గ్రామాలు క్వారంటైన్‌లో ఉన్నాయి’’ అని కుమార్‌ వెల్లడించారు. మరోవైపు ఆగ్రాలో సోమవారం 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 134కు చేరింది. వీరిలో దాదాపు 60 మంది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని ఆగ్రా జిల్లా కలెక్టర్‌ ప్రభు ఎన్‌ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 483కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం 432 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికం ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారు, వారితో కాంటాక్ట్ ఉన్న వారే కావడం గమనార్హం.